Sunday, October 19, 2014

ఆదిపర్వం 19

ఇప్పుడు కచుడు శుక్రాచార్యుల వారి దగ్గర త్రికరణ శుద్దిగా సేవ చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి అధిగమించలేని ఒక బలహీనత ఉన్నది, ఏమిటి ఆ బలహీనత అంటే ఆయనకీ ఒక్కత్తే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్తు ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతారు. దేవయాని ప్రీతి పొందక పోతే , శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే, దేవయాని ప్రీతి కూడా పొందాలి.

ఇక్కడ మీరు ఒక ధర్మ సూత్రాన్ని గమనించాలి. అలాగే ప్రవర్తించాడు కచుడు. కచుడు బ్రహ్మ చారి , దేవయాని కన్య. ఆయన ఆమె ని అంతగా సేవిస్తే, అంతగా దగ్గర అయితే , వాళ్ళిద్దరి మధ్య ఏర్పదేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరిమధ్య ఏర్పడే ప్రేమ చివరికి ఏ స్థితి ని పొందాలి అన్న విషయం లో ఎవరికీ ఉండే నియమాల చేత వారు సంస్కారాన్ని పొంది ఉంటారు. 

కచుడు బాగా శుక్రాచార్యుల వారినీ దేవయానిని సేవిన్చినటువంటి కారణం చేత చాల ప్రీతి పొందుతున్నారు , శుక్రాచార్యుల వారు రోజూ ఈయన ప్రీతీ ఎక్కువై పోతే ఏదో ఒక రోజున మృతసంజీవని విద్య ని ఉపదేశం చేసేస్తారు గురువుగారు. కాబట్టి ఈ కచుడు లేకుండా చెయ్యాలి అని అక్కడ ఉన్న రాక్షసులు అందరు అనుకుంటున్నారు. బ్రహ్మచర్య ఆశ్రమం లో ఉన్న వారికి కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా గురు పత్ని పిలిచి , నాయనా భిక్షన్నం తీస్కురా అంటే వెళ్లి తీస్కువస్తాడు. గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే తీస్కోస్తాడు. వెళ్లి కాసిని పువ్వులు పళ్ళు , తేనే పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. లేదా ఈ ఆవులను మేపు అంటే ఆవుల్ని తీస్కెళ్ళి మేపుతూ ఉంటాడు. 

అలాగే కచుడు ఒకరోజున ఆవుల్ని తీస్కొని వెళ్ళాడు. వెళ్లి ఆ ఆవుల్ని మేపుతున్నాడు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదలిక అని మీకు ఎప్పుడు చెప్పినా అది పర్దేవతానుగ్రహం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయిన సందర్భం లో అంతర్ముఖుడై తనలో తాను రమిస్తూ తాను శివుడు గా మిగిలిపొయిన శివుడు తప్ప , మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా, అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతనుగ్రహం లోపించిందో , కదలిక ఇంకోలా మారిపోతుంది. ఉత్తర క్షణం లో పతనం ప్రారంభం అయిపోతుంది. పరదేవతను గ్రహాం ఉంటె మీ కదలికలో ఏదైనా దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది. 

ఇప్పుడు ఆయన సమిధల్ని తీస్కు రావటానికి వెళ్తే ఏదో దారి తప్పాడు అనుకోవచ్చు. కానీ ఆవుల్ని తీస్కుని వెళ్ళాడు. ఆ ఆవులకి ఒక లక్షణం ఉంటుంది, అవి తిరిగి ఇంటికి వస్తాయి. కాబట్టి ఆ రోజున ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు కాబట్టి , ఆవులు ఇంటికి వచ్చినా అతను రాకపోతే, అతనికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని అనుమానించటానికి ఆస్కారంఏర్పడింది. 

దేవయానిని కూడా తృప్తి పరిస్తే తప్ప, సంతోసించని మనసు శుక్రుడికి ఉండటం , కచుడికి అదృష్టం అయ్యింది. శుక్రుడు పట్టించుకోలేదు , కానీ దేవయాని పట్టించుకుంది, ఇతను ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగింది, అలా అడిగేవారు లేరనుకోండి , ఆయన ఏమైపోనో.. ఏ పులులు తినేసినవో , అయినా బ్రతికించ గలడు శుక్రాచార్యుల వారు. 

ఇప్పుడు ఆ రాక్షసులు ఏమి చేసారంటే , ఆయన్ని (కచుడు) తీస్కెళ్ళి ఒక చెట్టు కి కట్టేసి , ఆయన్ని నరికి చంపేసారు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు, సాయంకాలం వరకు ఆవులు అక్కడ మేత మేసాయి, వెనకాతల తోలుకెళ్ళిన వాడు ఎవడున్నాడో అతను మరణించాడు, ఆయన్ని చెట్టుకి కట్టేసారు, కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినటం కుడా చాలా తేలిక క్రూర మృగాలకి, ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు, ఆయన సాయంకాలం చేయవలసిన హోమం ఏది ఉందొ అది చేస్కున్నాడు, చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు, దేవయాని వచ్చి  శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది, ఆవిడ హృదయం ఆయన యందు అనురాక్తమై ఉన్నది అన్న విషయం ఆవిడ మతాడుతున్న తీరు బట్టి స్పష్టం అవుతుంది. 

కాబట్టి ఆవిడ శుక్రాచార్యుల వారి వద్దకి వెళ్లి అన్నది , మనసులో ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాట్లాడవలసిన మాటలు, చాలా తీవ్రమైన వేడి కలిగిన కిరణములు కలిగిన సూర్యుడు పశ్చిమ సముద్రం లో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. వెళ్ళిన ఆవులు , ఒక్క ఆవులే తిరిగి  వచ్చాయి, ఆవుల్ని తోలుకుని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు, నీ అగ్ని మాత్రం చక్కగా హోమ కార్యం మాత్రం పూర్తి చేసేసావు. దానికి కావాల్సిన పూర్తి చేసేసావ్, అంటే అందులో ఒక చిన్న దెప్పిపొడుపు ఉంది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడకి ఎంత ఆందోళన ఉందొ చుడండి ఆయన రాక పోవటం మీద.

వనం లో మృగముల వలన కాని , రాక్షసుల వలన కాని ఏమైనా భాద పొందాడో ఏమో కాబట్టి నాన్న గారు కచుడు రాలేదు నాకు చాలా ఆందోళన గా ఉంది అన్నది. అంటే వెంటనే దేవయాని ఏదైనా మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు , శుక్రాచార్యుల వారు, తన కూతురు మీద ఆయన కి ఉన్న అభిమానము ,అవధి లేనిది. అంత మహాతపస్వికి హద్దులేని ప్రేమ ఉండటం ఆశ్చర్య కరం.

ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి తన దివ్య దృష్టితో  చూసాడు, ఇప్పడు ఆయన అంతర ద్రుష్టి తో ఒక్కసారి లోకం అంతా చూసాడు. కనపడలేదు, ఏమిటా అని బాగా పరిశీలనం గా చుస్తే ఒక చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది, ఆయన అన్నాడు రాక్షసులు కచుణ్ణి చంపశారు అని చెప్పాడు, అసుయచేత అన్నాడు.

వెంటనే దేవయాని చాలా బాధ పడిపోయింది , అలా కాదు నాన్న గారు బ్రతికించాలి అంది, ఆయన తన విద్య ని స్మరించాడు , మృతసంజీవని విద్యని అంటే ఎంత చెప్పుచేతల్లో ఉంటాయో చుడండి ఆ శక్తులు, కాబట్టి ఆయన మృత సంజీవనీ విద్య తో అన్నాడు , నువ్వు వెళ్లి అదిగో ఆ చెట్టుకి కట్టబడిన కచుణ్ణి స్పృశించి, ఆయన్ని మళ్ళి పునరుజ్జీవితున్ని చెయ్యి అన్నాడు, ఇప్పుడు ఆ విద్య వెళ్లి ఆయన్ని స్పృసించింది ఆయన మళ్ళి బ్రతికాడు.

చాలా సంతోషించాడు , కచుడు , మహానుభావుడు నన్ను బ్రతికించాడు అని, పైకి ఈ మాట అనక పోయినా చాలా సంతోషించింది దేవయాని, పగ పెరిగింది రాక్షసులకి. రాక్షసులు అందరూ సమావేశమై , శవం దొరికితే బ్రతికించాడు, కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి, మన గురువుగారికి ఒక శక్తి ఉంది , బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా మళ్ళి బ్రతికిస్తాడు , కాబట్టి ఇక బ్రతికించటానికి అవకాసం లేకుండా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి, బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించెయ్యాలి, అప్పుడు మృత సంజీవని తో బ్రతికించినా వాడు బయటకి రావాలి, వాడు బయటకి వస్తే గురువుగారు చనిపోతారు. అందుకని గురువుగారు ఇంక బ్రతికించరు అనుకున్నారు. కాబట్టి ఈ సారి వాడిని కాల్చి బూదిచేసి , దాన్ని గురువుగారు తాగే మద్యం లో కలిపి పట్టించేద్దాం, మద్యానికి మత్తెకించే లక్షణం ఉందిగా, అంతా బూది వస్తోంది ఏమిటి అని ఆలోచించడు. మొదటసారి గుటక లోనే మత్తు ప్రారంభం అయ్యి తాగెస్తారు.

ఇలా అనుకుని రాక్షసులు ఏమి చేసారంటే , పువ్వులు తేవటానికి అరణ్యానికి వెళ్ళిన కచుణ్ణి చంపి , బూది చేసి ఆ బూదిని శుక్రాచార్యుల వారు తాగే మద్యం లో కలిపి, ఆయనకి ఇచ్చారు , ఇస్తే ఆయన పుచ్చేస్కున్నారు, దేన్నీ బట్టి ఒక విషయం స్పష్టంగా ఉంది. అప్పటివరకు కుడా బ్రాహ్మణులూ కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని.

సరే సాయంకాలం అయ్యింది , ఇంకా కచుడు ఇంటికి రాలేదు, ఇప్పుడు అడిగేవారు ఎవరు మళ్ళి దేవయనే , అంటే అర్థం ఏమిటి పగలంతా కచుడు వచ్చేవరకు అతని గురించే ఆలోచిస్తుంది అని గుర్తు, అంటే ఒక కన్యకి అటువంటి లక్షణం ఉంది అంటే , అది కచ్చితంగా అనురాగ సంభందమై ఉన్నది అని అర్థం. సాయంకాలం అయ్యింది ఆయన రాలేదని అడిగింది దేవయాని తండ్రి ని, ఆయన అన్నాడు ఏముంది రాక్షసులు చంపేసి ఉంటారు , మళ్ళి  బ్రతికించమని అడుగుతుందేమో అని ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడు లే అన్నాడు.

ఏమిటి చాలా తేలికగా చెప్పేసారు , ఆయన ఎవరు అనుకుoటున్నారు , మహానుభావుడైన అంగీరస మహర్షి యొక్క మనుమడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి, పైగా దేవగురువైన బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాదు , మీకు శిష్యుడు, సురూపమైన బ్రహ్మచర్యాశ్రమము నందు ఉన్నవాడు  అటువంటి వాడిని , కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని, ఆయన్ని చంపేసారు , అటువంటి కచుడి గురించి శోకించొద్దు అంటారేమిటి, నేను ఏడుస్తున్నాను , ఏడిస్తే ఏడువు అంటారేమో నేను అన్నం తినను, ఆ కచుడు లేకపోతే, అన్నది.

అప్పటికీ అతడి మీద ఉన్న అనురాగం, శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదు అని సందేహం కలగవచ్చు, అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో ముందు అర్థం అవుతుంది. ఆమె అంత హటం చేస్తే అదేమిటమ్మా అన్నం కుడా తినను అంటున్నావు, అంటే అంతే కచుడు బ్రతకాల్సిందే , అయితే సరే బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్లీ అంతర్ముఖుడై చూసాడు , ఎక్కడా కనపడలేదు, ఆకరికి తన కడుపులో నే కనపడ్డాడు.

అమ్మా ఈ రాక్షసులు నాచేత తగిన్చేసారు బూది కలిపేసి , లోపాలకి వెళ్ళిపోయాడు. సురాపానం అనేది ఇప్పటివరకు బ్రాహ్మణులూ చేసారు , కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంతతపస్సు ఉన్నవాడైన ఎంతటి జ్ఞానం ఉన్న వాడైనా ఎంత భక్తి ఉన్న వాడైనా, సురాపానం చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది, ఏమి చేస్తున్నాడో తెలియదు. నేను సురాపానం చెయ్యటం వలన అందులో కచుని యొక్క బూది ఉంది అన్న సంగతి తెలుసుకోకుండా తాగేశాను కాబట్టి నేను ఇవ్వాళ నించి లోకానికి ఒక వాక్కు విదిచిపెడుతున్నాను , బ్రాహ్మణుని తో సహా మనుష్య పుటక పుట్టినవాడేవ్వడు శురాపానము చెయ్యరాదు, అలా శూర పానం చేస్తే ఘోరాతిఘోరమైన స్థితి ని వాడు పొందు గాక కాబట్టి ఇక ఆ నాటి నుంచి ఇక సురాపానం అన్నది పూర్తిగా నిషిద్దం శాస్త్రం లో .

కాబట్టి ఇప్పుడు తన లోపల ఉన్న వాడిని బ్రతికించాలి కుతురుకోసం, కాబట్టి ఆయన ఆ మంత్రం చదివాడు , లోపల ఆ కచుడు ఊపిరి పోస్కుని ఆ కచుడు మళ్ళి సహజ స్థితిని పొందాడు, ఇప్పుడు కచుడు అన్నాడు గురువుగారు మీరు నన్ను బ్రతికించారు సరే , ఇప్పుడు నేను బయటికి రావటం ఎలా? అంటే శుక్రాచార్యుల వారు అన్నారు , నువ్వు అలా కడుపులో ఉండగానే మృతసంజీవని విద్యని నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. నువ్వు మృత సంజీవని విద్య ని పొందు , పొంది నువ్వు బయటకి రా , నేను మరణిస్తాను, తర్వాత నువ్వు నన్ను బ్రతికించు అన్నాడు.

ఇక్కడ మీరు గమనించండి కచునిమనసులో ఏదైనా ఆలోచన ఉంటె , మృత సంజీవనీ విద్య పుచ్చేస్కోని , గురువుగారి కడుపులోంచి బయటకి వచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోతే, కచుడికి తప్ప మృత సంజీవనీ విద్య తెలిసున్న వాడు రాక్షసులలో లేడు ఎవ్వడు.

రెండు నేను చనిపోయిన తరువాత వీడు బయటకి వచ్చి నన్ను బ్రతికిస్తాడో ,బ్రతికించడో అనుమానం, అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తాను అమ్మా అని శుక్రాచార్యుల వారు అడుగవచ్చు, శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది, ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కుడా శుక్రాచార్యుల వారికి రాలేదు, త్రికరణ శుద్ధి కల సిష్యుడైతే గురువుగారిని అలా మోసం చేద్దాం అన్న ఆలోచన శిష్యుడికి రాలేదు.

శుక్రాచార్యుల వారు ఎప్పుడూ ఏమనుకున్నాడంటే, ఈ కచుడు నాకు శిష్యుడు అంటే నాకు కొడుకుతో సమానం , దేవయాని ఆయన కూతురు , ఇప్పుడు దేవయాని ఒక చెల్లెలి గా అన్నగారిమీద బెంగ పెట్టుకుంటుంది అనుకున్నాడు, తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు ఊహించలేక పోయారు. అందుకని ఆయనకీ అందలేదు ఆ విషయం ఆయన లోపల అంత ధర్మం పట్టుకున్నాడు.

కచుడు దేవయాని తనపై అంత  అనురక్త అయి ఉంది అని తెలుసుకోలేక పోయాడు, ఎందుకని అంటే గురువుగారిని నేను ఎంత సేవిస్తున్నానో, ఈవిడని అంత సేవిస్తున్నాను, ధార్మిక కోణం లో చూసినప్పుడు , గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలు అవుతుంది,కాబట్టి ఒక అన్న గారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది అనుకున్నాడు.

ఇప్పుడు కచుని యందు , శుక్రునియన్దు దోషం లేదు, ధర్మ వైక్లవ్యం దేవయాని యందె ఉంది. తనంత తానుగా అహాoకరించటానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏమి లేవు. ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యులవారి కూతురిని అని, కాబట్టి నేను అతని యందు అనురాక్తను అవ్వడమే అతని జన్మ ధన్యం అనుకుంది.

కాబట్టి ఇప్పుడు తానూ పొందాలనుకున్న విద్య మృత సంజీవనీ విద్య అది తెలుసుకున్నాడు, పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు కుడా నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గరకి వెళ్లి "అయ్యా ఇంక నేను వెళ్లి వస్తాను , నేను మా తండ్రిగారిదగ్గరకి వెళ్లి దేవతల్ని మా తండ్రిగారిని సేవిస్తాను" అన్నాడు.

చిత్రం ఏమిటంటే , నీకు ఇచ్చిన విద్యతో దేవతలని బ్రతికించ వద్దు ఇప్పటివరకు రాక్షసులే బ్రతుకుతున్నారు అని అనగలడు , కానీ ఆయన అనలేదు. విద్య ని ఇచ్చిన గురువు, దీనితో నువ్వు దేవతల్ని బ్రతికించ వద్దు అనలేదు, ఇది శుక్రాచార్యుల వారి గొప్పతనం. నిష్కర్ష గా ఆయన మహానుభావుడు. అంత ఉదారుడై ఇచ్చేసాడు ఆయన.

ఇప్పుడు దేవయాని అంది ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేను కన్యని ఆవిడ దృష్టిలో మన ఇద్దరి మధ్య అనుభందం అంది ఆయనకీ భార్యా స్థానం లో స్త్రీ కావలి ఈవిడకి భర్త్రు స్థానం లో ఒక పురుషుడు కావలి , కాబట్టి ఆవిడ అంది, నీకు ఒక అవసరం ఉంది , నాకు ఒక అవసరం ఉంది అని గుర్తుచేస్తుంది.

భూమియందు పుట్టిన గొప్ప దేవతా శ్రేష్టుడా , ఎంత పెద్ద మాట అంది అంటే  ఇప్పుడు కొత్తగా నన్ను నువ్వు పెళ్లి చేస్కో అని అడుగట్లేదు, ఎంత అహంకారమో, నీకు నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అంది. ఎప్పుడైపోయింది. మనోజుడు అని మన్మధునికి ఒక పేరు , కాబట్టి నీకు నాకు పెళ్లి మనోజుని యొక్క ప్రకోపం చేత,ఎప్పుడో అయిపొయింది , అంటే నేను నిన్ను అలా చూసాను. నువ్వు నన్ను అలా చూసావు అని నిర్దారించేస్తోంది. ఆయన అలా చూసాడో లేదో కానీ ఆవిడా అనేస్తుంది, అనటం కాదు, అదే సత్యం అని చెప్తుంది.

కాబట్టి నీకు నాకు మన్మదునివల్ల పెళ్లి అయిపోయింది. కాబట్టి శుక్రాచార్యుని దయతో రెండు పుచ్చుకో, ఒకటి మృతసంజీవని, రెండు నీ అదృష్టం నన్ను కూడా పుచ్చుకో, తప్ప అంతటి మహానుభావుడు , తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడకి , నేను ఆయనకి భార్యని అవ్వటం ఆయన అదృష్టం అనుకుంటోంది.

ఎందుకు దేవయానికి ఈ అహంకారం, అహంకారించటానికి ఏదో కారణం ఉంది అని నన్నయ్య గారు ఏమి చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుది ఎప్పుడు ఏమనో తెలుసా , మృతసంజీవని తెలిసున్న , శుక్రాచార్యుని కూతుర్ని అని చెప్పుకుంటుంది తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత తపస్సు ఉందొ, ఎంత వినయం ఉందొ, ఎంత భక్తి ఉందొ, తనకి ఎంత ఉందొ ఎప్పుడూ పరిసీలించుకోలేదు. మహాత్ముల తో ఉన్న సంభందాన్ని అహంకరించటానికి వాడుకోవటం పతనానికి హేతువే తప్ప ఉన్నత్తికి హేతువు ఎన్నటికి కాదు.

కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, నేను కోరుకున్న కోరిక తీర్చు, అంటే కచుడు అన్నాడు నాకు అలాంటి మన్మధ వికారం ఎన్నడూ కలుగలేదు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సుక్ష్మం ని పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. కచుడు ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకని దేవయానిని చెల్లెలుగా భావించాడు. గురువుగారి కూతురు చెల్లెలితో సమానం.
వేరొక భావం కి చోటే లేదు. గురువులకి శిష్యులు పుత్రులు. కాబట్టి నువ్వు నాకు చెల్లెలు తో సమానం. ఓ గురు పుత్రి నేను ఆయన కొడుకుని అని ఊహించుకున్న రోజు నువ్వు నాకు ఏమయ్యావో తెలుసుకో అని చెప్పి కాబట్టి తల్లి నన్ను వదిలేయి నేను వెళ్తున్నాను అని అన్నాడు.

ఇది విన్న ఆమె కి ఎక్కడలేని కోపం వచ్చింది, వచ్చి అసలు నువ్వు ఏ మృత సంజీవని కొరకు నువ్వు మా నాన్న దగ్గరకి వచ్చి గురు సుశ్రుష చేసి నాకు సేవలు చేసి పొందావో అది నీకు ఫలించకుoడు గాక అని శపించింది. ఇచ్చిన తండ్రిగారు అనలేదండి ఈ మాట ఆయన ఉదారుడు ఆవిడ అంది. అంటే నాకు ఫలించదు , ఇది నాకు ఫలించదు , కానీ ఇది నేను పొందుదామని రాలేదు, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకి ఉపదేశం చేస్తాను. వాళ్ళకి ఫలిస్తుంది గా . విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా.

విద్య కి ఉన్న ప్రయోజనాన్ని ఎవరూ ఏ కారణానికి ఆపలేడు . ఇంత ధర్మం లేని దానివి , ఇంకొక బ్రాహ్మణున్ని చేస్కుని కుడా ఆయన బ్రహ్మణ్యం ఏమి నిలబెదతావ్ నువ్వు అనువర్తించి. కాబట్టి నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండు గాక అన్నాడు. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె , భర్త బ్రాహ్మణ  తేజస్సు కలవాడు కాదు. ఇప్పుడు ఇది పెద్ద శాపం, బ్రహ్మాణ స్త్రీ అయ్యుండి, ఆవిడకు బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితం లో ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు , దౌహిత్రుదు (కూతురి కొడుకు ) బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. అక్కర్లేని చొరవ ఎక్కడి వరకు కట్టి కుదిపింది చుడండి.


















Monday, October 6, 2014

ఆదిపర్వం 18

శంకర భగవత్ పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు అమ్మా నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరూ కోరిన కోర్కెలు తీర్చ గలిగిన ఓ పరదేవతా! హరి నిన్ను మోహించి జగన్మోహిని రూపాన్ని పొందాడు, ఇక్కడవరకు బానే ఉంది అప్పుడు మనకి ఏమి గుర్తొస్తుంది అలా జగన్మోహిని రూపం ధరించడం వల్లనే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచటం లో రాక్షసులకి దక్కకుండా, లోకాన్ని కాపాడి అంటాం, అక్కడే శంకరా చార్యుల వారు ఏమి చేసారంటే , మన అందరినీ పక్కకి తోసేసి ఇంకోవైపుకి వెళ్లారు.

శంకరాచార్యులు అన్నారు అమ్మా శ్రీమహా విష్ణువు నిన్ను ఉపాసన చేసారు, నువ్వేమి చేసావు , లోకం లోక్కెల్లా నువ్వే అందగాత్తెవి త్రిపురసుందరివి నీ అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చావు ఇప్పుడు ఆయన జగన్మోహిని అయ్యాడు, అమృతం గురించి చెప్తే బానే ఉండేది, కానీ శంకరాచార్యులు ఏమ్మన్నారంటే అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా , మీ ఆయన పరువు బజారున పడింది అన్నారు. పరమ శివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు అన్నాడు.

పురములు కాల్చిన పరమేశ్వరుని లో కామము బయలుదేరి, ఆయన ఆ జగ్నమొహిని అవతారం పొందిన ఆ విష్ణువు వెంట పడ్డారు. అమ్మా ఎంత పని చేశావమ్మా మరి ఇంకా ఊరుకున్నావా? ఆ పరమ శివుడు మన్మదున్ని కల్చేసాడు. కలచేస్తే ఇంకేముంది జననం లేదు మరణం లేదు. ఎవరి మీద కాముడు బాణాలు వెయ్యటం లేదు హాయి. సుఖం గా ఉన్నారు అందరు , అని మనం అనుకుందాం కాసేపు, అమ్మవారు ఏమి చేసింది మన్మదున్ని బతికించింది. బతికించి పైగా ఏమి చేసింది ఎవ్వరికి కనపడవు రా !, ఒక్క మీ ఆవిడకే కనపడతావు అంది.

కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాణాలు వేస్తాడో , ఎంత నిష్ట గా ఉన్నవాడు ఆ బాణాలకి ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. అమ్మా దీని వల్ల  ఏమైంది అంటే , ముక్కు ముస్కుని , హిమాలయ పర్వతాల లో జపం చేస్కునే వాళ్ళు కూడా బయపడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కుడా కామానికి వశులై పోతున్నారు. కాబట్టి అమ్మా ఇంత గొప్ప పని చేసిన నీకొక నమస్కారం అంటారు శంకరులు.

ఇది పైకి బావుందేమో , మీరు కొంచం జాగ్రత్త గా ఆలోచిస్తే, ఇంత గొప్ప అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చి పరమ శివుని ప్రతిష్ట బజారున పారెయ్యటం , పతివ్రతా లక్షణమా?
రెండు ఆ కాముడు లేకపోతే ఈ చావులేదు పుట్టుకా లేదు, ఏ గొడవా లేదు. ఆ కాముడికి ప్రాణం పోసింది ఆవిడ , ఆ మన్మధుడు బతక బట్టి మన అందరికి ఈ అల్లరి వచ్చింది. పుట్టటం , చావటం , పుట్టటం ,చావటం. పోనీ ఊరుకుందా ఆ మన్మధున్ని బాణాలు ఎవరిమీద వెయ్యటానికి కూడా అధికారం ఇచ్చేసింది, ఒరేయి తపస్సు చేకుంటున్న ఋషుల మీద కూడా వేస్తె వెయ్యి నేనేమి అనను అన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయ పడిపోతున్నారు. అమ్మా ఇన్ని చేసిన నీకు ఒక నమస్కారం.

ఇది స్తోత్రమా ? నిందా ? భయపడకుండా గుండెలమీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఇందులో నిజాయితీ గా త్రికరణ శుద్దిగా అమ్మవారిని  అబ్బా ఏమి అమ్మవారు అని స్తోత్రం చెయ్యటం ఏమైనా ఉందా ? ఏమీ లేదు , మరి ఏమిలేని దానికి శంకరా చార్యుల వారు సౌందర్య లహరి లో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు.

ఎవరు చట్టాన్ని చేసారో , వారు ఆ చట్టాన్ని తెసేసే అధికారం కలిగి ఉంటారు.  ఇక్కడ వరకు అంగీకరిస్తారా? ఇంకా రెండు మీరు మేము ఇంకా బెంగ పెట్టుకున్నది దేని కొరకు అయ్యయ్యో ఆ చచ్చి పొయిన మన్మధున్ని అమ్మవారు మళ్ళి ఎందుకు బ్రతికించింది అని.

అమ్మవారు మనమధున్ని పుట్టించలేదు అనుకోండి, మన్మధ బాణములు లోకంలో పడలేదు అనుకోండి. సృష్టి ఆగిపోయింది గా , సృష్టి ఆగిపోతే మనం చేసిన పాప పుణ్యాలు పోయేది ఎప్పుడు. ఈ శరీరం ఉంటె కదా పాప పుణ్యాలు పోయేది? ఈ శరీరం పోయిన తరువాత జీవుడు మళ్ళి పుట్టాలి , మీతో నేను కొంచం కటినంగా ఉన్నా ఎదార్థం చెప్తున్నాను.

గరుడ పురాణం చెప్తుంది, శరీరం లేకుండా దక్షిణ దిక్కున పిత్రులోకం అంటారు , అక్కడ నిలబడి పోయారు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటె పుణ్య కర్మ చెయ్యొచ్చు , పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో ఒక శరీరం ఇవ్వు ఈశ్వరా, శరీరం అంటూ ఉంటె నేను మళ్ళి నిన్ను శరీరం తో సేవిస్తాను అంటాడు. కానీ ఏ శరీరం పడితే అది ఇస్తే ఏమీ చెయ్యలేదు, మనుష్య శరీరం ఇస్తేనే చెయ్యగలడు.

ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావలి, కావాలంటే ఎలా వస్తుంది?  తల్లి తండ్రుల మీద మన్మధ బాణాలు పడితేనే నా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం వస్తేనే నా మీరు మళ్ళి పాప పుణ్యాలు పోగొట్టుకోవటానికి ఈశ్వరుని సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు , కామున్ని బ్రతికించటం వలన , మనకి ఈ శరీరాలని పొందటానికి అవకాశం వచ్చిందా లేదా ?అమ్మవారి అనుగ్రహం లేదు అందులో.

నేను మీతో ఇంకో మాట మనవి చేస్తాను మీతో, అమ్మవారు కమున్ని ఎప్పుడైతే బ్రతికిన్చిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ? నీ కామము ధర్మ బద్దం అయితే నువ్వు పితృ ఋణం నించి బయట పడి పోయావు. ధర్మ బద్దమైన కామం తో ధర్మ పత్ని యందు కామం పెట్టుకున్నావ్. సంతానాన్ని కనడం తో పితృ ఋణం నించి బయట పడ్డావు.

కాబట్టి నీకు కాముడు ఉంటె బెంగ ఎందుకు , పితృ ఋణం తీరింది. ధార్మికమైన కామం అనుభవించ లేక పోతున్నాను, అప్పుడూ బెంగ లేదు, ఈ విషయం అమ్మవారికి చెప్పు , అమ్మా నువ్వు కమున్ని ఇచ్చావు , కామాన్ని ఇచ్చావ్ , కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా , కామాన్ని ధర్మం తో ముడి వెయ్యలేక పోతున్నాను ఆ ముడి వెయ్యలేక పోవటం వాళ్ళ నేను పడైపోతున్నాను అని అమ్మవారితో చెప్పు , ఎవరు చట్టం చేసారో వాళ్ళే చట్టాన్ని రద్దు చేసినట్టు, నువ్వు అమ్మవారి పదాలు పట్టుకుంటే , అమ్మ కమున్ని పిలిచి వాడి జోలికి వేళ్ళకు అంటుంది.

మీకు ఇంకో విషయం చెప్తాను , మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామ స్పర్స ఉండదు, ఆయన అస్కలిత బ్రహ్మచారి , ఆయనకి అసలు ఎట్టి పరిస్థితులలో కామం అనే స్పర్స అంటదు, ఇప్పడు ఆయన శరీరం తో ఉండి పోతాడా? నాకు చెప్పండి, ఎంతటి మహాత్ముడైన కానివ్వండి , ఆయన శరీరము ఒక ప్రత్యేకమైన దేశ కాలము యందేనా ఉంటుంది? ఎప్పటికి ఉండిపోతుందా ? చంద్రశేకర భారతీ స్వామివారే అయినా , శంకర భగవత్ పాదులే అయిన శరీరాలని విడిచి పెట్టేసారు, వెళ్లి పోతారు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళి ఇంకో మహాత్ముడు శరీరం లోకి వచ్చి కూర్చుంటే మీకు భోధ ఉంటుంది. లేకపోతే ఆగిపోతుంది.

కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి , మళ్లి మళ్ళి మళ్ళి మహాత్ములు రావాలి, ఇప్పుడు కుడా మనకు మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే , మన తప్పులు మనం తెలుసుకుని ,మనం ధర్మ మార్గం లోకి వెళ్తాం. కానీ అలా చెప్పి మాట్లాడే మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరం లోకి రావాలంటే ఆయన తల్లి తండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణమైన మనసుతో భార్యాభర్త లు ఇద్దరు సంగమించక పోతే , పరిపూర్ణమైన ఆరోగ్యం తో శిశువు పుట్టడు. విముఖులై సంఘమిస్తే తేజోవంతమైన , ఆరోగ్యవంతమైన శిశువు పుట్టదు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంఘమించినా సత్సంతానం కలగలేదు, భారతం లో. వెల వేల బోతే పాండురాజు పుట్టాడు , కళ్ళు మూసుకుంటే ద్రుతరాస్త్రుడు పుట్టాడు.

పరిపూర్ణ హృదయం తో ఒక మహాపురుషుడు, ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప, ఆయన వీర్యం స్కలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి, ఆయనకీ కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెళ్తుంది. వెళితేనే ఇంకో మహాత్ముడు పుడతాడు, పుడితేనే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు. మీకు రాసేవాడు లేడు , చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమై పోవాలి , కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే అంతకంటే మహా పురుషుని లో కామం కలగాలి, ఆయనకి కామం కలగదు, ఎందుకని అంటే ఆయన మహా పురుషుడండి, పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది, ఒక్కనాటికి కలగదు.

పరాశర మహర్షి వంటి మహా పురుషుని తేజస్సుని పట్టగలిగే క్షేత్రం ఉండాలి. కారణ జన్మురాల్ని సృష్టించాలి. కారణజన్ముడైన పురుషుడు పుట్టాలి అంటే ఉపరిచర వసువు వంటి మహా పురుషుని వీర్యం గిరిక లోకి వెళ్ళ వలసినది, శాప విమోచనం కావలిసిన అద్రికలోకి వెళ్లి అద్రిక నుండి మత్యగoధి పుట్టి, మత్యగంది వంటి ఉపరిచర వసువు వల్ల పుట్టిన గొప్ప క్షేత్రం లోకి పరాసరుని తేజస్సు ప్రవేశిస్తే, ఈ క్షేత్ర భీజ సంపర్కం చేత వేరొక మహా పురుషుడైన వేదవ్యాసుడు, పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం.

ఇప్పుడు పరాశర మహార్శిలో కామo కలగాలి , ఆయనకి కలుగుతుందా ఒక్కనాటికి కలగదు, సత్యవతి ని చూడగానే ఆయనకీ కామం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకూ నాకు భారతం లేదు. వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడు అంతటి మహా పురుషుని మనసుని కదప గలిగినది ఎవరు?
ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చెయ్య గలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏమి చెయ్యాలి , అంతటి మహాపురుషుని మనసు , కామ ప్రచోదనం కలిగేటట్టు చెయ్యాలి.

కాబట్టి ఎవరు చేసింది అని గుర్తు, పరాశక్తి చేస్తుంది , ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి యందు లగ్నం అయితే సత్య గర్భమున వేదవ్యాసుడు పుడతాడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంత వరకు అవసరమో అంత వరకే చేసింది , పరాశక్తి. ఒక్క వ్యాస జననం వరకే ఇంకా ఆ తరువాత , పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. మహాపురుష జననం ఎందుకు జరుగుతుంది, పరాశక్తి నిర్ణయం చేస్తుంది. అందుకే మహా పురుష జననములను విచారణ చెయ్యవద్దు అని అన్నారు.

మహాపురుష జననము నందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే , నీకు పాపం వస్తుంది. అందువలన శాస్త్రం ఏమి అన్నదంటే, ఒకవేళ నీకు అర్థం కాకా పోతే ఊరుకుండి పో విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననము , నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు, నది ఉంది స్నానం చెయ్యి అంతే. ఎక్కడ పుట్టింది అని అడగకు.
మహపురుషుని వలన నీకు వాంగ్మయం వచ్చింది. నువ్వు వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టాడు అని అడుగ వద్దు.

పరదేవతనుగ్రహం కలిగింది, వ్యాస భగవానుడు పుట్టాలి, ద్వాపర యుగం అయిపోతోంది, కాళీ యుగం ప్రారంభం అవుతుంది, కలియుగం లో కలిపురుషుడు విజ్రుమ్భిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్ని అంతటిని ఎవరూ చదవలేరు, వేదాన్ని అంతటిని విభాగం చేసి, ఉన్న ఆయుర్దాయం లో వేదాన్ని చదువుకునే వాడు ఉండాలి, అష్టాదశ మహాపురనములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి, శిష్యుల్ని తానె తాయారు చేస్కో గలగాలి. మహా పురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావలి, అటువంటి వాడు పుట్టాలి అంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి.

అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా అంతటి తేజస్సు పట్ట గలిగిన క్షేత్రం ఏది, అందుకని ఆ క్షేత్రాన్ని కుడా పరదేవతే సిద్దం చేసింది. వేరొక మహాపురుషుడి తేజస్సు కదిపి అది అద్రిక మింగి, అది అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరస గర్భం నుండి బయటకి వచ్చింది కాబట్టి , దాశ రాజు దగ్గర పెరిగితే, యమునా నది దాటుతున్న అప్పుడు ఆయన హృదయము ఆమె యందు నిలబడింది. మనకొరకు ఆయన మనసు ఎంత వరకు కదలాలో అంతవరకు కదిలేలా చేసిన పరదేవతనుగ్రహాన్ని మీరుచదువుతున్నరని గుర్తు.

అందుకే ఆదిపర్వం లో మహాపురుషుల జననం వింటే, సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది యొక్క అనుగ్రహము కలిగేస్తుంది . మహా పురుష జననం వెనకాల పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది.

ఇప్పుడు తీర్థ యాత్ర కి వెళ్తున్న ఆ పరాశరుడు యమునా నది పైన పడవ నడుపుతున్న ఆ యోజన గ్రంధి ని చూసి ఆయనకీ అసలు మదము లేదు మత్సరము లేదు, లేని వాడికి ఎలా కలిగింది , మనకోసం కల్పించింది పరదేవత. నీ తేజస్సు జారితే కాని రాదు వ్యాసుడు అని. ముడులోకముల చేత స్తోత్రం చెయ్య బడే వాడు, వసిష్టుని యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు, పాపములు నశించిపోయే టట్టు గా ఘోరమైన తపస్సులు చేసిన వాడు,మంచి వ్రతం తో తీర్థ యాత్ర కి వెళ్ళే వాడు.

వొంటినిండా యోజనం దూరం వరకు చేపల కంపుకొట్టే ఆ స్త్రీ ని చూసాడు,  ఇందులో ఒక విచిత్రం ఉంది, పొగ ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్లి కూర్చుంటే, పొగ ఉండదు. కంపు ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్తే కంపు ఎక్కువ వస్తుంది. ఇంత మహాన్వితుడు అంత దుర్వాసన వస్తున్నా మత్యగంది దగ్గరకి వెళ్లి చుస్తాడండి ఆయన? మరి చూసాడు అంటే మన కోసం చూసాడు అని చెప్పాలి. పరదేవతానుగ్రహం గా చూసాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడు.

కోరితే ఆ మాత్య గంధి అంది నేను కన్యని , నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగుపెట్ట నిస్తాడా ? అటువంటి తప్పుడు పనిచేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహా పురుషుడవైనా కావొచ్చు నీతో సంఘమం నాకు ఎలా కుదురుతుంది.

అంటే ఆయన అన్నాడు ఇది బహుశః పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనసు నీయందు నిలబడటం ఏమిటి, నీకు వరం ఇస్తున్నాను. నీ శరీరము చేపల వాసన కదూ వస్తోంది అని అంటున్నావు, ఇక నించి నువ్వు యోజన గంది వి అవుతావు, మత్యగంధి వి కావు, నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నించి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే  ఎదర భరత వంశానికి వరం అయ్యింది. ఊరికినే ఋషి నోటివెంట ఏమాటా రాదండి. అమ్మవారు పలికిస్తోంది. యోజన గంధి వి అవుతావు, ఆ వాసన లే శంతన మహారాజుని తీస్కువచ్చాయి.

నీ కన్యత్వం చెడదు, 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భం ధరించక్కర్లేదు, సత్య గర్భం గా ఇప్పుడే మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున, నీవు కన్య గానే ఉంటావు నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచుతెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత, పరాశర మహర్షి యొక్క సంఘమ ఫలితంగా పరమేష్టి సమానుడైన పరాశర మహర్షి అనుగ్రహం చేత సద్యో గర్భం లో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, పుట్టుకతోనే నాలుగు వేదములు నేర్చుకుని పుట్టిన వాడు. సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. సకల మునులకు మొట్ట మొదటి వాడు. పుట్టుకతోనే మహా జ్ఞానం తో పుట్టాడు మహానుభావుడు.

వచశ్రీమంతుడు పుట్టాడు, పుట్టీ పుడుతూ నే నల్లటి వర్ణం తో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేస్కోవటానికి వెళ్ళిపోతున్నాను అమ్మా , తండ్రి పరాశర మహర్షి తన సహజ స్థితి లోకి వెళ్లి పోయాడు ,పుట్టిన బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె కన్యత్వం చెడలేదు, ఎదర భారత వంశం నిలబడటానికి ప్రాతిపదిక పడింది.

శుభ క్షణం లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాసం లేదు. భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కధ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి ఆ భీస్మున్ని అలా నిలబెట్టింది. మళ్ళి భీష్ముడు అలా నిలబడక పోతే, దీర్ఘాయుషుమంతుడు కాక పోతే వశిష్టుడి శాపం నిలబడదు, వసిష్ట మహర్షి యొక్క వాక్కు నిలబడ టానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేస్కోవటానికి వెళ్తుంటే ఆయన్ని , కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచారు. అక్క వనం లో పుట్టి వెంటనే వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది.

నాయనా ! నువ్వు నన్ను అడిగావు కదా అసలు ఎందుకు జరిగింది భారత యుద్ధం , అసలు ఎందుకు చెప్పిన మాట వినలేదు అని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపొయింది పాపుల చేత, భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈలోకంలో పాపభారం పెరిగిపోతుంది , దీన్ని నిర్మూలించ టానికి దేవతంశలు రావాలి , శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాప భారాన్ని అంత పోగొట్టాలి అన్నారు, అంటే తప్పకుండా అలాగే అని వరం ఇచ్చారు .

ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసాoడి ఆ సమయం లో, అది పోగొట్టటానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలు అందరు అంశాలతో కదిలి రావాలి , అందుకని దేవతలు అందరూ కదిలి వచ్చారు. దేవతంశలలో వచ్చిన వారు కొందరు, రాక్షసంసలలో పుట్టేసినవారు కొందరు, ఇప్పుడు రాక్షస అంశలలో పుట్టిన వాళ్ళు అందరూ దేవతంశాలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూ భారం తీరుతుంది.

భారతం లో గమత్తు ఏమిటో తెలుసా , దేవతంశలలో వచ్చిన వారు రాక్షసాంసలలో పుట్టిన వారి దగ్గర నించొని యుద్ధం చేసారు. భీష్ముడు దేవతాంస, ద్రోణుడు  దేవతాంస బృహస్పతి అంశ వీళ్ళు కౌరవుల పనుపున యుద్ధం చేసారు. అలా ఎందుకు చేసారు? ఒక పెద్ద ధర్మ సంభందమైన అనుమానం కదండి!

ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పా వలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏమి చేస్తాం ,మీరు ముందు మీ కళ్ళ కి మంట కలిగినా , ఖేదం కలిగినా ఆ పొగ ని భరిస్తూ ఒక గొట్టం పట్టుకుని, మంట దగ్గర కి వెళ్లి ఊదాలి, మీరు ఊదితే రాజుకుంటుంది, రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత అన్నం వండుకోవచ్చు, నీలు కాగాబెట్టుకోవచ్చు, ముందు కష్ట పడాల వద్దా , దుర్యోధనుడు యుద్దానికి వచ్చి నిలబడాలి అనుకోండి, భీష్ముడు ,ద్రోణుడు , కృపుడు అందరు అటువెళ్లి పోయారు అనుకోండి, ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, పన్నాగాలు పన్నుతూ నే ఉంటాడు. ఇంక ఎలా రక్షసాంస లు పోవటం.

రక్షసాంసలు దేవతంస ల తో తలపడాలంటే వాడికి ధైర్యం కలగటానికి కొన్ని దేవతంసలు తమ స్వరూపమునందు మార్పు లేకుండా నే వెళ్లి అక్కడ నించోవాలి. అందుకు నించున్నాడు, భీష్ముడు , ద్రోణుడు. అది మహా భారతం లో అత్యంత చమత్కారం. అందుకని నించున్నారు తప్ప ,చేత కాకో , దుర్యోదనుడి మోచేతి నీళ్ళ కోసమో కాదు. ఊదటం కోసం పొయ్యిని ,నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడక పోతే ఆ యుద్ధం లో వాళ్ళు పడరు,
రాక్షసులు , అందుకని కొంతమందిని అక్కడ నించోపెట్ట వలసి వచ్చింది కృష్ణ భగవానుడు.

కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎలా జన్మించారంటే, ఎన్నడూ దుఖం లేని పరమాత్మా ఈలోకం లో ధర్మాన్ని స్థాపించడం కోసం , దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ప్రలంభుడు మొదలైన రాక్షసులని సంహరించటానికి , ఆదిశేషుడు యొక్క అంస  , బలరాముడి గా రోహిణి వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. పదహారువేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు.

దేవతలే యదు , భోజ, అంధక వంశాలలో రాజులుగా వచ్చారు.  వసువులలో ప్రభాసుడు అనే ఒక గొప్ప వసువు భీశ్మాచార్యుడి గా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడి గా వచ్చాడు, కామము క్రోధము కలగలిసి ఉంటె ఎంతో ప్రమాదం, ఈ రెండిటిని కలకలిస్తే పుట్టిన వాడు అస్వర్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టిన వాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్దంలో అందరూ మడిసి పోయిన, ఎప్పటికీ గురుత్వం వహించాడు కృపాచార్యుడు..
 
సూర్యుని యొక్క అంశ లో వచ్చిన వాడు కర్ణుడు,   హంసుడు అనే గంధర్వుడు ద్రుతరాస్త్రుడిగా వచ్చాడు. మతి గాంధారి గా వచ్చింది. కలి పురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్యభాత్రు వంశం అంతా కుడా రాక్షసులు అంతా కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్య కశ్యపుడు  శిశుపాలుడి గా పుట్టాడు ,సమ్హలాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్పలా దుడు జరసందుడిగా పుట్టాడు.

కాలనేమి కంసుడిగా పుట్టాడు, శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస స్వరూపము రెండు కలిసి ఉండే ఒక దేవత శిఖండి గా పుట్టాడు. మరుత్గణాoశ తో పుట్టిన వాడు పాండురాజు, మండవ్యుని శాపం వలన యమధర్మ రాజు మళ్ళి పుట్ట వలసి వస్తే విదురుడిగా పుట్టాడు , సిద్ది బుద్ది ఇద్దరు , కుంతీ మాద్రిగా పుట్టారు. అనేకమైన దేవతల అనుగ్రహం తో యమధర్మ రాజు అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జనుడు , అశ్వినీ దేవతల యొక్క అంశలలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపం గా లక్ష్మీ స్వరూపం గా , సంపద రూపంగా యాజ్ఞ సేని జన్మించింది. యాజ్ఞ సేని అంటే ద్రౌపది , ద్రౌపది దేవి యజ్ఞం లోనించి ఆవిర్భవించింది. అగ్ని ద్రుస్తాజ్మ్నుని గా వచ్చాడు

మరుత్యకి ద్రుపద , విరాట లుగా వచ్చారు , ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంత మంది , ఈ భూమి మీద రాక్షసంసలతో జన్మించిన వారిని మత్తు పెట్టటానికి, దేవతలందరూ ఇన్ని అంశలలో జన్మించారు. శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఆవిర్భవించారు.

రాక్షసంస లలో ఉన్నవాళ్లు కనుక మాట వినలేదు. అందుకని వచ్చింది భారత యుద్ధం అంతాను, వాళ్ళని మట్టు పెట్టటానికి  భూభారం తగ్గించటానికి వచ్చింది. అంటే జనమేజయుడు అడిగాడు అసలు మా వంశం ఎక్కడ ప్రారంభం , భరతుని యొక్క వంశం ఎక్కడ ప్రారంభం అయ్యింది. దాని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు.
వైశంపాయనుడు , వ్యాసుడు దొరికినప్పుడు కదండీ చెప్పించుకోవటం , లేనప్పుడు ఎవరిని అడుగుతాం. కాబట్టి చెప్పండి అన్నాడు.

అంటే ఆయన ఎక్కడికి తీస్కెళ్ళి ప్రారంభం చేసాడంటే , పూర్వం దేవతల గురువు అయిన బృహస్పతి, ఆయన యొక్క కుమారుడు కచుడు. రాక్షసులందరికి గురువు శుక్రాచార్యుల వారు, శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు ఆమె పేరు దేవయాని, దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడైన కచుడి దగ్గరకి దేవతలందరూ వెళ్లి ప్రార్ధన చేసారు , ఏమని అంటే

శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది, ఆయన వృష పర్వుడు అనే రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడి గా ఉన్నాడు ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవనీ విద్య వున్న కారణం చేత దేవతలకి , రాక్షసులకి యుద్ధం జరిగితే, చచ్చిపోయిన రాక్షసులని అందరినీ మృతసంజీవని విద్య తో బ్రతికించే స్తాడు దేవతలని బ్రతికించే వాళ్ళు లేరు.

కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య తెలుసుకోవాలి, శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్యా ఎందుకు ఇస్తారు, తక్కరితనం తో నేర్చుకున్నరనుకోండి, గురువుగారి దగ్గర విద్య, తెలిసిన తరువాత గురువుగారు ఆ విద్య నీకు పనికిరకుండు గాక అంటాడు. అందువలన గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు, గురువుగారి అనుగ్రహం తోనే తెలుసుకోవాలి.

గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు, గురు సుశ్రుష త్రికరణ శుద్ధి గా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్లి చెప్పు నేను దేవ గురువు బృహస్పతి యొక్క కుమారుడిని అని చెప్పు , చెప్పి నువ్వు బాగా సుక్రచార్యులవారి సేవ చెయ్యి, శుక్రాచార్యుల వారి ఒక్కరి కి సేవ చేస్తే సరిపోదు , శుక్రుడి ప్రీతీ అంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది, దేవయాని ప్రేమకూడా నువ్వు చొరగొను , ఇప్పుడు నువ్వు దేవయాని ప్రేమ నువ్వు పొందితే , దేవయాని చెప్తే ఎదోక కారణం చేత నీకు మృత సంజీవనీ విద్య నీకు దొరుకుతుంది.

కాబట్టి త్రికరణ శుద్ధి గా ఇద్దరినీ సేవించి , గురువుగారిని , గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండ చేస్తాను అని కచుడు శుక్రాచార్యుల వారిదగ్గరకి వెళ్ళాడు. వెళ్లి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు , శుక్రాచార్యుల వారితో, ఆయన అన్నాడు నేను చాల నియమములు కలిగినట్టి వాడిని , దేవగురువైన బృహస్పతి కుమారున్ని, నన్ను కచుడు అంటారు , నేను నీకు సేవ చేసి నీదగ్గర , విద్య నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు.


అడిగితే గురువు అన్నవాడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో చుడండి, శుక్రాచార్యులవారు అన్నారు , బృహస్పతి మహానుభావుడు , బృహస్పతి కి నమస్కరించటం ఒకటి , నిన్ను శిష్యుని గా స్వీకరించటం ఒకటి కాదు, కాబట్టి నాయనా సంతోషంగా రా , నీ మాటలు మృదు వచనములు నాకు ఎంతగానో నచ్చాయి. చక్కగా ఆశ్రమం లో ఉండి నా దగ్గర విద్యలు అన్ని నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే .

ఆ వెళ్ళిన కచుడు త్రికరణ శుద్ధి గా సేవ చేయ సాగాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చారు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చారు. వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందిన కుడా మృత సంజీవనీ ఆయన చేతికి వచ్చే లోపల కధ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భారత వంశం ఎలా రావాలో, ఎన్ని ధర్మాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యమో చూద్దాం.